తక్కువ ధరకే చెన్నై నగరంలో చికెన్ బిరియాని లభిస్తుందని లొట్టలేసుకుంటూ తింటున్న మాంసాహార ప్రియులకు దిమ్మతిరిగిపోయే వార్త ఇది. బిరియానీ ఆర్డరిచ్చినప్పుడు ఆదమరచి తిన్నారా..? తరువాత కలలో కోడికి బదులు పిల్లి వస్తుంది.
అవునండీ నిజం! చికెన్ బిరియానీ పేరుతో ‘పిల్లి మాంసం’తో వండిన బిరియానీ నగరంలో విక్రయిస్తున్నట్లు విస్మయాన్ని కలిగించే విషయం బయటపడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఫుట్పాత్లపై తోపుడు బండ్లు, చిన్న టెంట్లను వేసుకుని ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. ఇక్కడ శాకాహారంతోపాటు మాంసాహార వంటకాలు కూడా లభ్యమవుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్ల పక్కనే పొయ్యిలను ఏర్పాటుచేసి వంటలు తయారుచేస్తున్నారు. పాత్రలపై సరైన మూతలు పెట్టకపోవడంతో దుమ్ము, ధూళి కలవడం సరే, కోడి మాంసంతో పిల్లి మాంసాన్ని కలిపేసి బిరియానీ వండుతున్నారన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిజానికి ఈ దుకాణాలలో తక్కువ ధరలకు భోజనం లభిస్తుండడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సంచార జాతుల ద్వారా పిల్లుల్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.